గత ప్రభుత్వ హయాంలో శాసన సభకు, అన్ని ప్రభుత్వ వ్యవస్థలకు, అలాగే ఇక్కడి ముద్రణా యంత్రాలకు తుప్పు పట్టింది.
అన్ని రంగాల్లో తప్పు వదిలించే ప్రయత్నాలు చేపట్టాం.
అందులో భాగంగానే శాసన సభ ముద్రణాలయాన్ని ప్రక్షాళన చేస్తున్నాం.
ఆధునిక యంత్రాలతో అసెంబ్లీకి అవసరమైన పత్రాలను వేగవంతంగా ముద్రించి, సభ్యులకు సకాలంలో అందించేందుకు దోహదం.
అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 60 రోజులపాటైనా జరగాలి.
రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు
అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ భవనంలో కోటిన్నర రూ.ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హైస్పీడ్ ముద్రణా యంత్రాలను గురువారం అసెంబ్లీ భవనంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ సెక్రటరీ-జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ అత్యాధునిక ముద్రణా యంత్రాలు శాసన సభ సమావేశాల్లోను, మరీ ముఖ్యంగా బజ్డెట్ ప్రవేశపెట్టే సమయంలోను కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అంతేగాక శాసన సభకు సంబంధించిన ముద్రణలన్నిటినీ, అంటే ప్రశ్నలు, ఎజండా పత్రాలు, సభా సంవాదాలు వంటి కీలకమైన పత్రాలను అత్యంత వేగంగా ముద్రించ గలుగుతాయని చెప్పారు.
స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈముద్రణా పరికరాలను పరిశీలించానని, వాటిని తక్షణం మార్పుచేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి కోటిన్నర రూ.లు మంజూరు చేయగా నేడు అత్యాధునిక ముద్రణా యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు కర్నూల్ లోగల ప్రభుత్వ ముద్రణాలయానికి కూడా మరో కోటి రూ.లతో అత్యాధునిక ముద్రాణా యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను తుప్పు పట్టించినట్టే శాసన సభలోని ముద్రణా యంత్రాలకు కూడా తుప్పు పట్టించారని ఆ తుప్పును వదిలించే ప్రక్రియలో భాగంగానే నేడు ఈఆధునిక ముద్రణా యంత్రాలను ఏర్పాటు చేశామని ఆయన వ్యాఖ్యానించారు.
శాసన సభ సమావేశాలు ఏడాదిలో కనీసం 60 రోజులైనా జరగాలి
రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఏడాదిలో కనీసం 60 రోజులైనా జరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా సభలో చర్చించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు అందించినట్టు అవుతుందని రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఇదే అంశాన్ని పట్నాలో జరిగిన స్పీకర్ల సమావేశంలో స్పష్టంగా చెప్పామని గుర్తు చేశారు.గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో అసెంబ్లీ సమావేశాలను కేవలం 78 రోజులే నిర్వహించిందని, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 31 రోజుల పాటు సభ జరిగిందని ఆయన తెలిపారు.
వైసిపి సభ్యులు సభకు రాకుంటే వారి 2 ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే యోచన
రాష్ట్ర శాసన సభ సమావేశాల సమయంలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి వైసిపికి 2 ప్రశ్నలు కేటాయించామని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు చెప్పారు. అయితే వైసిపి సభ్యులు ఆరెండు ప్రశ్నలు సభకు సమర్పిస్తున్నారే గానీ, వాటిని అడిగేందుకు సభకు మాత్రం రావడం లేదని, అందువల్ల ఆరెండు ప్రశ్నలు వృధా అవుతున్నాయన్నారు. ఇక మీదట ఆవిధంగా ప్రశ్నలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఇకనైనా వైసిపి సభ్యులు సభకు రావాలని హితవు పలుకుతూ, వస్తారో రారో కూడా స్పష్టంగా తెలియ జేయాలని, లేదంటే ఆ రెండు ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే ఆలోచన చేయక తప్పదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పీకర్, శాసన సభకే హాజరు కాని వారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల గురించి అడగ్గా, గతంలో నామినేషన్ వేసేందుకు కూడా భయపడ్డ ప్రాంతాల్లో, భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలవడం ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనడానికి నిదర్శనమన్నారు.



