హోటల్ బిల్లులో కొత్తగా ‘గ్యాస్ ఛార్జ్’.. కస్టమర్లు షాక్ – వైరల్ అవుతున్న రసీదు
దేశంలో వంటగ్యాస్ కొరత ప్రభావం ఇప్పుడు హోటల్ బిల్లుల వరకు చేరింది. కొన్ని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లకు ఇచ్చే బిల్లుల్లో ప్రత్యేకంగా ‘గ్యాస్ ఛార్జ్’ అనే పేరుతో అదనపు ఫీజు వసూలు చేస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిల్లును చూసిన కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైలోని ఒక రెస్టారెంట్లో కస్టమర్ ఇడ్లీ, వడ ఆర్డర్ చేయగా ఆహారం ధరలతో పాటు బిల్లులో “Gas Charge” పేరుతో రూ.9.52 అదనంగా చేర్చారు. ఇడ్లీ రూ.33.33, వడ రూ.33.33గా ఉండగా, గ్యాస్ ఛార్జ్ కలిపి మొత్తం జీఎస్టీతో కలిసి రూ.80 బిల్లు ఇచ్చారు. ఈ రసీదు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక నగరాల్లో హోటళ్లు మెనూలను తగ్గించడం, పని గంటలను తగ్గించడం, కొన్నిచోట్ల తాత్కాలికంగా మూతపడటం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న వంటగ్యాస్ ఖర్చులను భరించలేక కొంతమంది రెస్టారెంట్ యాజమాన్యాలు బిల్లులో ప్రత్యేకంగా గ్యాస్ ఫీజును చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారుల నుంచి దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “ఆహారం ధరల్లోనే అన్ని ఖర్చులు ఉండాలి, విడిగా గ్యాస్ ఛార్జ్ ఎందుకు?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
వంటగ్యాస్ సరఫరా సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే హోటల్ రంగంపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ‘గ్యాస్ ఛార్జ్’ బిల్లులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.


